<b> బౌద్ధ మతం </b>


<b> బౌద్ధ మతం </b>

బౌద్ధ మతం

 

గౌతమబుద్ధుడి అసలు పేరు.. సిద్ధార్థుడు.

క్రీ.పూ. 563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని వద్ద జన్మించాడు.

తండ్రి శుద్ధోధనుడు శాక్య తెగ అధిపతి. తల్లి మాయాదేవి కొలియ తెగలో పుట్టింది.

సిద్ధార్థుడు పుట్టిన కొద్ది కాలానికే తల్లి మరణించడంతో సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి చేతుల్లో పెరిగాడు. అందుకే అతడిని గౌతముడు అంటారు. అయితే ‘సిద్ధార్థుని గోత్ర నామమైన గౌతమి నుంచి కూడా గౌతముడు అనే పేరు వచ్చి ఉండొచ్చు’.

గౌతముడికి యశోధర అనే రాకుమార్తెతో వివాహం జరిగింది. వారికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. ఒకరోజు రథసారథి చెన్నడు రథం తోలుతుండగా బుద్ధుడు దారిలో ముసలివాడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూశాడు. వీరిని చూసిన తర్వాత అతడికి దేహం అశాశ్వతమని, ప్రాపంచిక సుఖాలు క్షణభంగురాలని, నిష్ర్పయోజనాలని అనిపించి హృదయంకలత చెందింది. అర్ధరాత్రి తన రథసారథిని అశ్వం సిద్ధం చేయమని ఆజ్ఞాపించి దానిపై బయలుదేరి వెళ్లాడు. సిద్ధార్థుడు తన 29వ ఏట మహాభినిష్ర్కమణం చేశాడు.

సిద్ధార్థుడు చాలా గ్రామాలు ప్రయాణం చేసి వైశాలి గ్రామం చేరాడు. అక్కడ ‘అలారకలామ’ అనే గురువు దగ్గర సాంఖ్య దర్శన విజ్ఞానం సంపాదించాడు. కానీ దీనివల్ల తృప్తి పొందలేకపోయాడు. తర్వాత వైశాలి రాజధాని అయిన రాజగృహానికి వెళ్లాడు. అక్కడ కూడా సంతృప్తి చెందలేక ఉరువేల అనే ప్రాంతం చేరాడు. అక్కడ బోధి వృక్షం కిందకు చేరాడు. ఈ ప్రదేశం గౌతముడికి నచ్చడంతో జ్ఞానోదయం పొందేవరకు అక్కడే తపస్సు చేయాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏడువారాల దీర్ఘ తపస్సులో నిమగ్నమైన తర్వాత వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం అయింది. అప్పుడతడు బుద్ధుడయ్యాడు. ఆ ప్రదేశం బుద్ధ గయగా మారింది.

బుద్ధ గయ (ఉరువేల) నుంచి బుద్ధుడు వారణాసి చేరి తర్వాత సారనాథ్‌లోని జింకల వనంలో తన పూర్వ సహచరులైన ఐదుగురు బ్రాహ్మణ సన్యాసులకు ప్రప్రథమంగా జ్ఞానోపదేశం చేశాడు. ఇదే ధర్మచక్ర ప్రవర్తనంగా పేరొందింది. వారు బుద్ధుడికి శిష్యులు అయ్యారు. వారితో బుద్ధుడు ఒక సంఘం స్థాపించాడు. తర్వాత మగధాధీశులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు బుద్ధుడికి శిష్యులయ్యారు. దొంగ అయిన అంగుళీమాలుడిని బుద్ధుడు బౌద్ధుడిగా చేశాడు.

దుఃఖ నివారణ సాధించడానికి దుఃఖ కారణమైన కోరికలను త్యజించాలని అందుకు అష్టాంగ మార్గాన్ని అవలంబించాలని బుద్ధుడు బోధించాడు. అష్టాంగ మార్గంలో ఎనిమిది సూత్రాలున్నాయి. ఈ ఎనిమిది సూత్రాలను చక్కగా అర్థం చేసుకొని ఆచరణలో వాటిని పాటించడం ద్వారా మనశ్శాంతి, జ్ఞానం, నిర్యాణంపొందొచ్చని బౌద్ధం చెబుతోంది.

వృద్ధాప్యంలో ఆనందుడిని తన పరిచారకుడిగా ఎంపిక చేసుకున్నాడు. బుద్ధుడు తన 80వ ఏట క్రీ.పూ. 483లో కుశినార అనే ప్రదేశం వద్ద నిర్యాణం చెందాడు. దీనినే మహాపరినిర్యాణం అంటారు. ‘మహాపరిని బానసుత్త’ కుశినార వరకు జరిగిన బుద్ధుడి చివరి యాత్రను, అపాయకరమైన రోగం, నిర్యాణం, అవశేషాల పంపిణీ గురించి విపులంగా పేర్కొంటుంది.

బుద్ధుడి మరణం తర్వాత ఆయన బోధనలను త్రిపీఠకాల రూపంలో సేకరించారు. త్రిపీఠకాలు అంటే మూడు ధర్మపు బుట్టలు. అందుకే వాటికి త్రిపీఠకాలు అని పేరు వచ్చింది. బౌద్ధం కొన్నేళ్లకు హీనయానం, మహాయానం, వజ్రయానం రూపాలుగా పరిణామం చెందింది. మహాయానంలో బుద్ధుడిని దేవుడిగా పరిగణించారు. వజ్రయానంలో మళ్లీ కర్మకాండలకు ప్రాధాన్యం పెరిగింది.

బుద్ధుడి పూర్వ జీవితం గురించి చెప్పే కథలే జాతక కథలు. ఎడ్విన్ ఆర్నాల్డ్ బుద్ధుడిని ‘ఆసియాజ్యోతి (light of Asia)’ అని, శ్రీమతి రైస్ డేవిడ్‌‌స ‘ప్రపంచ జ్యోతి (light of world)’ అని కీర్తించారు.

మహనీయులు బుద్ధుడిని భగవంతుడిగా చేసి ప్రజలకు పూజించే అవకాశం కల్పించారు. మహాయాన బౌద్ధ మతం సుమారు క్రీ.పూ. 1వ‌ శతాబ్దంలో ఆంధ్ర దేశంలో ప్రవేశించిందని తెలుస్తోంది. మహాయాన బౌద్ధుల నుంచి హిందువులు విగ్రహారాధన చేపట్టారు.

బుద్ధుడి జననం : కపిలవస్తు,లుంబినీవనం ( క్రీ.పూ 563 )

మరణం : కుశినగరం, (క్రీ.పూ410 నుండి 400 మధ్యలో ఉండవచ్చు)

నివాస ప్రాంతం : కపిలవస్తు

ఇతర పేర్లు : శాక్యముని, గౌతముడు,సర్వార్థసిద్ధుడు

ప్రసిద్ధి : భౌద్ధ మత స్థాపకుడు

ముందు వారు : కశ్యప బుద్ధ

తర్వాత వారు : మైత్రేయ బుద్ధ

మతం :భౌద్ధమతం

భార్య :యశోధర

పిల్లలు :రాహుళుడు

తండ్రి :శుద్ధోధనుడు

తల్లి :మహామాయ,మహా ప్రజాపతి(పెంపకం)

బుద్ధుని గుర్రం పేరు : కంథక

బుద్ధుని రథసారథి : చెన్నుడు

గౌతమబుద్ధుని సమకాలినరాజు: అజాతశత్రువు