<b>కాకతీయుల అనంతరం పరిస్థితులు </b>


<b>కాకతీయుల అనంతరం పరిస్థితులు </b>

కాకతీయుల అనంతరం పరిస్థితులు

 

తెలుగు జాతి గౌరవాన్ని సుసంపన్నం చేసి, దాని కీర్తిని దశదిశలా వ్యాప్తి చేసిన కాకతీయ రాజుల సామ్రాజ్యం ముస్లిం రాజుల దాడివల్ల ధ్వంసమైంది. క్రీ.శ. 1323లో జరిగిన యుద్ధంలో కాకతీయుల చివరి రాజు రెండో ప్రతాపరుద్రుడు ఓటమి పాలై ఢిల్లీ సైన్యానికి పట్టుబడ్డాడు. ఇతడు అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఓరుగల్లులో కాకతీయ సామ్రాజ్య సౌధం శాశ్వతంగా కుప్పకూలిపోయింది. తెలుగునాట ముస్లిం సైనిక పాలనకు పునాది పడింది. వీరి పాలనలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగు ప్రజలు స్వేచ్ఛ కోసం విముక్తి పోరాటానికి నడుం బిగించారు. ‘ముసునూరి ప్రోలయ నాయకుడు’ ఈ విమోచన ఉద్యమానికి నాయకత్వం వహంచి ప్రజలను ముందుకు నడిపించాడు.,

 

ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ (క్రీ.శ. 1320-25) కుమారుడు జునాఖాన్ (మహ్మద్‌బిన్ తుగ్లక్). ఇతడినే ఉలుగ్‌ఖాన్ అని కూడా అంటారు. కాకతీయులపై విజయం (1323) సాధించిన జునాఖాన్ వారి రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానత్‌లో కలిపాడు. ఇతడి నాయకత్వంలోని ఢిల్లీ సుల్తాన్ తురుష్క సైన్యం కాకతీయ రాజ్యానికి చెందిన ప్రజల సమస్త సంపదను దోచుకుంది. ఓరుగల్లు పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చారు. కాకతీయులు నిర్మించిన అనేక కోటలు, దుర్గాలు, దేవాలయాలను నాశనం చేశారు. దోచుకున్న సంపదనంతా ఢిల్లీకి తరలించారు. తురుష్క సైన్యం తమ క్రూరమైన చర్యలతో తెలుగు ప్రజలను భయకంపితులను చేసింది. చాళుక్యులు, కాకతీయులు నిర్మించిన అనేక దేవాలయాలను కూలగొట్టి వాటి స్థానంలో మసీదులను నిర్మించారు. మత మార్పిడులకు పాల్పడ్డారు. ముసునూరి ప్రోలయ నాయకుడు కందరాడ గ్రామంలో (పిఠాపురం సమీపంలో) వేయించిన ‘విలాసతామ్ర శాసనం’, విజయనగర కంపల రాయల భార్య గంగాదేవి రచించిన ‘మధురా విజయం’ (సంస్కృత కావ్యం), ప్రముఖ ముస్లిం చరిత్రకారుడు జియావుద్దీన్ బరౌనీ రచనల ద్వారా ఈ వివరాలు తెలుస్తున్నాయి. భారతదేశానికి వచ్చిన విదేశీ ముస్లింలు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉత్తర భారతం నుంచి తెలంగాణా ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు.

 

కాకతీయుల పతనం దక్షిణ భారత దేశానికి చెందిన అనేక రాజ్యాలకు శాపంగా మారింది. వీటిలో చాలా రాజ్యాలు 1325 వరకు తుగ్లక్ ఆధీనంలోకి వచ్చాయి. వారిలో ఉన్న అనైక్యత కారణంగా ముస్లిం సైన్యాన్ని అడ్డుకోలేక చాలా మంది రాజులు ఢిల్లీ సుల్తాన్‌కు లొంగిపోయారు. దౌల్తాబాద్ (దేవగిరి) వజీరైన మాలిక్ బుర్హనుద్దీన్‌ను తెలుగు ప్రాంతానికి అధికారిగా నియమించారు. పాలనలో ఇతడికి సహాయం అందించడానికి సుల్తాన్‌పూర్ (ఓరుగల్లు) కోటకు అధిపతిగా ‘మాలిక్ మక్బూల్’ను నియమించారు. ఢిల్లీ సింహాసనం కోసం వారసత్వ పోరు జరిగింది. మహ్మద్ బిన్ తుగ్లక్ తన తండ్రిని చంపి సుల్తానయ్యాడు. ఈ నేపథ్యంలో కాకతీయుల కాలంలో పనిచేసిన సైన్యాధికారులు, అనేక మంది బలమైన నాయంకరులు ఏకమై ఢిల్లీ సుల్తాన్‌పై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. తెలుగు ప్రాంతంపై ఇస్లాం పాలనను అంతం చేయడమే ప్రథమ కర్తవ్యంగా ఈ తిరుగుబాటులో అనేక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఈ పోరాటం హిందూ మతోద్ధరణకు, సంస్కృతి రక్షణకు తోడ్పడిందని అనితల్లి (రాజమండ్రి రెడ్డి రాజు కాటయ వేమారెడ్డి కుమార్తె) వేయించిన కలువచేరు శాసనం (క్రీ.శ. 1423) ద్వారా తెలుస్తోంది.

 

కాకతీయుల నాయంకర విధానం

కాకతీయుల సైనిక పరిపాలనను ‘నాయంకర విధానం’ అని పిలుస్తారు. రుద్రమదేవి ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రెండో ప్రతాపరుద్రుడు పునర్ వ్యవస్థీకరించి బలోపేతం చేశాడు. సైన్యాధికారులైన ఈ నాయంకరులు తమ ఆధీనంలో, వారి స్థాయిని బట్టి స్వతంత్రంగా కొంత సైన్యాన్ని పోషించేవారు. సైన్య పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం వీరికి కొన్ని గ్రామాలపై పూర్తి అధికారం ఇచ్చారు. వీరు ఈ గ్రామాల నుంచి శిస్తు వసూలు చేసుకునేవారు. కొంత సొమ్మును రాజుకు కప్పంగా చెల్లించేవారు. రాజుకు అవసరమైనప్పుడు సైనిక సహాయం చేయడం వీరి బాధ్యత. కాకతీయులకు నమ్మకంగా ఉన్న వంశస్థుల వారే వంశపారంపర్యంగా నాయంకరులుగా నియమితులయ్యారు. కాకతీయులు సాధించిన అనేక విజయాల్లో వీరు గణనీయ పాత్ర పోషించారు. రెండో ప్రతాపరుద్రుడి పాలన చివరి నాటికి ఈ నాయంకరులు చిన్న చిన్న రాజులుగా అవతరించారు. ఢిల్లీ సుల్తాన్ దాడుల వల్ల వీరి ప్రాబల్యం పతనమైంది. వీరు తమ ఉనికిని నిలుపుకోవడానికి ఢిల్లీ పాలనను ఎదురించాలని ఏకమయ్యారు. ఆ కాలంలో 75 మంది నాయంకరులున్నట్లుగా కలువచేరు శాసనం ద్వారా తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా వెలమ కులానికి చెందిన నాయకులే ఉన్నారని ‘ప్రతాపరుద్ర చరిత్ర’ ద్వారా తెలుస్తోంది. వీరితో పాటు రెడ్డి, కమ్మ, కాపు, తెలగ, యాదవ నాయకులు కూడా ఉన్నట్లు ఆధారాలున్నాయి. రైతు కుటుంబాలకు చెందిన వీరు మొదట సైన్యాధికారులుగా నియమితులై ఆ తర్వాత క్రమంగా ప్రభువులయ్యారు.

తెలుగు నాయకుల విమోచనోద్యమం

ప్రతాపరుద్రుడి మరణం తర్వాత వయోవృద్ధులైన కాకతీయ సేనానుల్లో ముఖ్యమైనవారు - ఇందలూరి అన్నయ్య, కొలని రుద్రదేవుడు, రేచర్ల సింగమ నాయకుడు, రేచర్ల ఏచ నాయకుడు, యాదవసాంగపనిదేవుడు. వీరు నాయంకరుల వారసులను ఏకం చేసి ఢిల్లీ సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించాలని నిశ్చయించారు. ముసునూరి ప్రోలయ నాయకుడిని వీరికి నాయకుడిగా ఎన్నుకున్నట్లు విలాసతామ్ర శాసనం, పోలవరం శాసనం, కలువ చేరు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రోలయకు అండగా అతడి పిన తండ్రి కుమారుడైన ముసునూరి కాపయ నాయకుడు వ్యవహరించాడు. వీరి నాయకత్వాన్ని అద్దంకి వేమారెడ్డి, కొప్పుల ప్రోలయ నాయకుడు, రేచర్ల సింగమ నాయకుడు, మంచికొండ గణపతి నాయకుడు, ఉండీ వేంగభూపాలుడు, ఎరువ చోడభక్తిరాజు, ఆరవీటి సోమదేవరాజు లాంటి ముఖ్యులు సమర్థించారు. 1325 చివర్లో మధ్యాంధ్ర ప్రాంతంలో ముసునూరి ప్రోలయ నాయకుడు తురుష్క సైన్యాలను ఓడించి రేఖపల్లిలో స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడికి అనుయాయిగా వేమారెడ్డి అద్దంకిలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు.

ముసునూరి నాయకులు

కమ్మ వ్యవసాయదారుల కుటుంబానికి చెందిన ముసునూరు నాయకులు దివిసీమను పాలించిన పిన్నచోడుని ఆశ్రయంలో ఉండేవారు. పిన్న చోడుని కుమార్తెలను (నారాంబ, పేరాంబ) వివాహమాడిన గణపతి దేవుడు వారి సోదరుడైన జాయపసేనానిని తన ఆస్థానంలో చేర్చుకోవడంతో ఈ ముసునూరు వారు కూడా కాకతీయుల కొలువులో చేరారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు సమీపంలోని ముసునూరు గ్రామం వీరి తొలి నివాసం. వీరు సైనిక శిక్షణ పొందడం ద్వారా వీరులయ్యారు. ప్రతాపరుద్రుడి మంత్రి అయిన ఇందలూరి అన్నయ్య సహకారంతో ముసునూరి పోచినాయకుడు కాకతీయ నాయంకరుడయ్యాడు. ఇతని కుమారుడు ముసునూరి ప్రోలయ నాయకుడు.

ముసునూరి ప్రోలయ నాయకుడు (1325-33): గోదావరి తీరంలోని రేఖపల్లి దుర్గం రాజధానిగా (భద్రాచలం తాలుకా) చేసుకొని ఇతడు మహ్మదీయులను ఎదుర్కొన్నాడు. ఇతడి నాయకత్వంలో సామంత ప్రభువులు చాలా విజయాలు సాధించారు. ప్రతి విజయంలో సోదరుడైన కాపయ నాయకుడి పాత్ర ఉంది. ఇతడికి ‘ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన సంప్రతిష్ఠాపనాచార్య’ బిరుదు ఉంది.

 

ముసునూరి కాపయ నాయకుడు (1333-69): ముస్లిం చరిత్రకారులు ఇతడిని కన్యానాయక్, కృష్ణా నాయక్‌గా వ్యవహరించారు. ప్రోలయ మరణం తర్వాత రేఖపల్లి కేంద్రంగా కాపయ పాలనను ప్రారంభించాడు. ఢిల్లీ పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రోలయ స్థానంలో ఇతడు నాయకత్వం వహించాడు. సుల్తాన్ కబంధ హస్తాల నుంచి ఓరుగల్లును విముక్తి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. హోయసాల రాజ్యాన్ని పాలిస్తున్న మూడో భల్లాలుడు పంపించిన సైన్యం సహకారంతో 1336-37 కాలంలో ఓరుగల్లు కోటపై దాడి చేశాడు. దీంతో ఓరుగల్లు పాలకుడు మాలిక్ మక్బూల్ ఢిల్లీకి పారిపోయాడు. 1337లో ఓరుగల్లు కోటను వశపర్చుకున్న కాపయ నాయకుడు అంతకుముందు కాకతీయుల ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలను తిరిగి తన అధికారంలోకి తెచ్చుకున్నాడు. కాపయ నాయకుడికి ‘ఆంధ్రదేశాధీశ్వర’, ‘ఆంధ్ర సురత్రాణ’ బిరుదులున్నాయి.

ఢిల్లీ సుల్తాన్ ముప్పు తొలగిన తర్వాత అప్పటివరకూ కాపయకు సామంతులుగా ఉన్న సహచరులు కాపయను ధిక్కరించి స్వతంత్రులయ్యారు. కాలక్రమంలో రాచకొండ (నల్గొండ జిల్లా)లో వెలమ నాయకులు (రేచర్ల అనపోత నాయకుడు), అద్దంకి, కొండవీడుల్లో రెడ్డి రాజులు (ప్రోలయ వేమారెడ్డి), విజయనగరంలో యాదవులు, కోరుకొండలో మంచికొండ నాయకులు (ముమ్మడి నాయకుడు), పిఠాపురంలో కొప్పుల నాయకులు బలమైన స్వతంత్య్ర రాజులుగా అవతరించారు.

ఓరుగల్లు రాజ్యానికి పొరుగున ఉన్న గుల్బర్గా (కర్ణాటక)కు సేనాధిపతిగా అల్లావుద్దీన్ బహమన్ షా (హసన్ గంగూ/ జాఫర్ ఖాన్) వ్యవహరించేవాడు. 1347లో ఇతడు తమ రాజైన ఢిల్లీ సుల్తాన్‌ను ఎదిరించి, గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్వతంత్రంగా స్థాపించాడు. ఢిల్లీ సేనల్ని ఓడించడంలో హసన్ గంగూకు కాపయ నాయకుడు సైన్య సహకారం అందించాడు. తన అవసరం తీరిన తర్వాత హసన్ గంగూ రాజ్య విస్తరణ కాంక్షతో 1350లో తెలంగాణపై దండయాత్ర చేశాడు. కాపయ నాయకుడు ఓడిపోయి కౌలాస్ కోట (నిజామాబాద్)ను బహమనీలకు ధారాదత్తం చేసి సంధి చేసుకున్నాడు. హసన్ గంగూ 1356-57లో తెలంగాణాపై మళ్లీ దాడి చేసి కాపయను ఓడించాడు. దీంతో కాపయ భువనగిరి కోట (నల్గొండ)ను వదులుకొని బహమనీలకు కప్పం కట్టడానికి అంగీకరించాడు.

హసన్ గంగూ మరణం తర్వాత 1359లో మొదటి మహ్మద్‌షా బహమనీ సుల్తాన్‌గా అవతరించాడు. కాపయ నాయకుడి కుమారుడు వినాయక దేవుడు, విజయనగర రాజైన మొదటి బుక్కరాయలు పంపిన సైన్యం సహకారంతో 1361లో భువనగిరి కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు కౌలాస్ కోటను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉండగా మొదటి మహ్మద్ షా ఓరుగల్లు కోటను ముట్టడించి కాపయ నాయకుడిని ఓడించి సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత మొదటి మహ్మద్ షా వినాయక దేవుడిని అతిక్రూరంగా హత్య చేశాడు.

కాపయ నాయకుడు బహమనీ సుల్తాన్‌ ను ఓడించడమే ధ్యేయంగా విజయనగరాధీశులతో కలిసి ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ సహాయమర్థించాడు. ‘కాఫిర్ల’ (హిందువుల)తో కలిసి స్వజాతీయులపై (ముస్లిం) యుద్ధం చేయడానికి ఫిరోజ్ షా నిరాకరించాడు. అది తెలిసిన మొదటి మహ్మద్ షా ఓరుగల్లుపై దండెత్తి సర్వనాశనం చేశాడు. కాపయ నాయకుడు చేసేదేమీ లేక బహమనీ రాజుతో సంధి చేసుకొని గోల్కొండ కోటను, అపార ధనరాశులను అప్పగించాడు. అప్పటికే కుంగిపోయిన ముసునూరి కాపయ నాయకుడు రేచర్ల వెలమ నాయకుడైన అనపోత నాయకుడి చేతిలో 1369లో భీమారం (వరంగల్) సమీపంలో జరిగిన యుద్ధంలో మరణించాడు. దీంతో ముసునూరి నాయకుల పాలన ముగిసింది.

తెలంగాణ రాజ్యం కమ్మ నాయకుల పాలన నుంచి వెలమ నాయకుల పాలనలోకి వెళ్లింది. ఓరుగల్లు రాచకొండ రాజ్యంలో భాగంగా మారింది. దీనికి రాజు అనపోత నాయకుడు. ఓరుగల్లు పట్టణం తన ప్రతిష్టను క్రమంగా కోల్పోయింది.