<b>మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-48)</b>


<b>మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-48)</b>

మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-48)

మీర్ మహబూబ్ అలీఖాన్, అమత్ - ఉజ్ -జహరున్నిసా బేగం దంపతులకు 1886లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ జన్మించాడు. ఇతడు ఏడో అసఫ్ జా బిరుదుతో హైదరాబాద్ సింహాసనాన్ని అధిష్టించాడు. ఏడో నిజాం పరిపాలనా కాలాన్ని హైదరాబాద్ రాజ్య చరిత్రలో నూతన శకంగా పేర్కొనవచ్చు. రాజ్యాన్ని ఆధునికత వైపు అడుగులు వేయించిన గొప్ప దార్శనికుడు ఉస్మాన్ అలీఖాన్. ఇతడిని హైదరాబాద్ చరిత్రలో గొప్ప హీరో, విలన్‌గా పేర్కొంటారు.

రాజ్యంలో వ్యవసాయాభివృద్ధి, తాగునీటి అవసరాలను తీర్చడానికి 1920లో ఉస్మాన్‌సాగర్ (గండిపేట చెరువు), 1927లో హిమాయత్ సాగర్; అలీసాగర్(బోధన్), రాయపల్లి చెరువు(మెదక్), పాలేరు చెరువు(ఖమ్మం)లను తవ్వించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారంతో నిజాంసాగర్‌ను నిర్మించి నీటిపారుదల సౌకర్యాలను కల్పించాడు. 1914లో పురావస్తు శాఖను ఏర్పాటు చేసి వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, ఎల్లోరా, అజంతా లాంటి చారిత్రక ప్రదేశాలను సంరక్షించాడు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 1912లో హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశాడు. 1919లో హైకోర్టు భవనాన్ని, జూబ్లీహాల్, అసెంబ్లీ, మొజంజాహి మార్కెట్ భవనాలను నిర్మించాడు. 1922లో హైదరాబాద్ రాజ్యంలో మరణశిక్షను రద్దు చేశాడు. సాంఘిక దురాచారాలైన దేవదాసి, వెట్టి చాకిరి విధానాలను అదే ఏడాది రద్దు చేశాడు.

1927లో ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాడు. 1936లో మాధ్యమిక విద్యా మండలిని స్థాపించాడు. 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఉన్నత విద్యను ప్రోత్సహించాడు. (1919 ఆగస్టు 28 నుంచి ఓయూలో విద్యాబోధన ప్రారంభమైంది.) నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా దేశంలో తొలి రోడ్డు రవాణా సంస్థను 1932లో ఏర్పాటైంది. రాజ్యాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దక్కన్ బటన్ ఫ్యాక్టరీ(1916), వజీర్ సుల్తాన్ టొబాకో(వీఎస్‌టీ) ఫ్యాక్టరీ, దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ(1927), నిజాం షుగర్ ప్యాక్టరీ(1937), సిర్పూర్ పేపర్ మిల్లు(1939), గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ(1941), హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్(1942) తదితర పరిశ్రమలను నెలకొల్పాడు.

హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ చట్టం-1941 ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రారంభమైంది. ఈ బ్యాంక్ మొదటి శాఖను 1942 ఏప్రిల్ 5న గన్‌ఫౌండ్రి వద్ద మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించాడు. ఉస్మాన్ అలీఖాన్ తన పేరు మీద ఉస్మానియా సిక్కాను ప్రవేశపెట్టాడు. ప్రముఖ చరిత్రకారుడు రాజేంద్రప్రసాద్ అభిప్రాయం ప్రకారం పాలనా పగ్గాలు చేపట్టిన తొలి సంవత్సరాల్లో ఉస్మాన్ అలీఖాన్ మంచి సంస్కర్త. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో, ముఖ్యంగా స్వదేశీ సంస్థానాల విషయాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించింది. ఇదే అదనుగా ఉస్మాన్ అలీఖాన్ ఆంగ్లేయ అధికారులను తొలగించి ముస్లింలతో ఉద్యోగాలను భర్తీ చేశాడు.

జిల్లాల పేర్ల మార్పు

మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్‌ను ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. 1905లో వివిధ జిల్లాల పేర్లను మార్చారు. ఎలగండలను కరీంనగర్‌గా, పాలమూరును మహబూబ్‌నగర్‌గా, ఇందూరును నిజామాబాద్‌గా, మెతుకును మెదక్‌గా మార్చారు. మానుకోటను మహబూబాబాద్‌గా, భువనగిరిని భోన్‌గిర్‌గా మార్చారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో 1927లో మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్-ముస్లిమిన్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అంజుమన్ తబ్లి గులిస్తాన్ అనే మరో సంస్థతో కలిసి హిందువుల్ని ముస్లిం మతంలోకి మార్చే తబ్లిక్ ఉద్యమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ నగరంలో ఆర్య సమాజం శాఖను 1892లో ఏర్పాటు చేశారు. కేశవరావ్ కొరాట్కర్, దామోదర్ సత్యాలేకర్, డాక్టర్ అఘోరనాథ్ ఛటోపాధ్యాయ లాంటి ప్రముఖులు నగరంలో ఆర్య సమాజ కార్యకలాపాలకు మద్దతునిచ్చారు. ఆర్య సమాజం తబ్లిక్ ఉద్యమానికి వ్యతిరేకంగా శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి ఇస్లాం మతంలో చేరిన వారిని తిరిగి హిందువులుగా మార్చింది.
 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాధ్యమంలోనే బోధించేవారు. మెజార్టీ ప్రజల మాతృభాషలైన తెలుగు, కన్నడ, మరాఠీల్లో విద్యాబోధనపై నిషేధం ఉండేది. తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేయడం వల్ల నారాయణగూడలోని ఆంధ్ర బాలికోన్నత పాఠశాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది.

 హైదరాబాద్ రాజ్యంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రజలు ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ఉస్మాన్ అలీఖాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడు. 1920లో హైదరాబాద్, కరీంనగర్, మెదక్ లాంటి పట్టణాల్లో ఖిలాఫత్ దినాన్ని పాటించారు. ఈ ఉద్యమ కాలంలో ముస్లింలు ఉస్మాన్ అలీఖాన్‌కు మెహివుల్ మిల్లత్-ఇ-ఉద్దీన్ అనే బిరుదునిచ్చి, ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జమీందార్, సియాసత్, జమానా లాంటి ఉర్దూ పత్రికలు ఖిలాఫత్ భావాలను ప్రచారం చేశాయి.

చందా రైల్వే ఆందోళన


భారత ప్రభుత్వం, హైదరాబాద్ ప్రభుత్వం మధ్య 1870లో ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మద్రాస్-బొంబాయి మార్గంలో వాడి-హైదరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలి. రైల్వేల విస్తరణతో బొగ్గుకు గిరాకీ పెరగడం వల్ల ఈ రైల్వే లైన్‌ను బొగ్గు గనులున్న ప్రాంతాలైన డోర్నకల్, సింగరేణి మీదుగా విజయవాడ వరకు పొడిగించాలని నిర్ణయించారు. కొద్దికాలం తర్వాత చందాలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. దీంతో రైల్వే లైన్‌ను చందా వరకు పొడిగించాలని నిర్ణయించారు.
 ఈ ప్రతిపాదనలు మొదటి సాలార్‌జంగ్ కాలంలోనే ఆమోదం పొందాయి. ఈ రైల్వే లైన్ల నిర్మాణానికి బ్రిటిష్ రైల్వే కంపెనీ మూడు లక్షల పౌండ్ల ధనాన్ని సమకూర్చింది. రైల్వే నిర్మాణ వివరాలు ప్రజలకు పూర్తిగా తెలియవు. ఈ ప్రతిపాదన వల్ల సంస్థానానికి ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుందని అప్పుడే ఉనికిలోకి వస్తోన్న విద్యావంతులు భావించారు. అందువల్ల చందా రైల్వే ప్రణాళికను పరిశీలించేందుకు సంస్థానంలోని విద్యావంతులు అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. చందా రైల్వే పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఈ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రజలు ఈ విధంగా కోరడం హైదరాబాద్ సంస్థాన చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విషయమై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పర్యవసానంగా అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం తదితరులను సంస్థానం నుంచి బహిష్కరించింది. 1883 నాటి చందా రైల్వే ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో ప్రజా చైతన్యానికి నాంది అనడంలో సందేహం లేదు.

తెలంగాణలో రాజకీయ చైతన్యం


ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణలో రాజకీయ చైతన్యం ఆలస్యంగా మొదలైంది. మిగతా సంస్థానాల తరహాలోనే హైదరాబాద్ సంస్థానంలోనూ నిరంకుశత్వం అమల్లో ఉండేది. రాజ్యంలో ప్రాథమిక హక్కులు కరవయ్యాయి. వ్యవసాయ కౌలుదార్ల పరిస్థితి దుర్భరంగా తయారైంది. ముక్తేదార్లు, ఫత్తేదార్లు అనే పెద్ద భూస్వాములు కౌలుదారీ రైతులను బాగేలా అనే దాస్యానికి, బానిసత్వానికి గురి చేశారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కొమర్రాజు లక్ష్మణరావు 1901లో హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంను స్థాపించారు. ఇదే తెలంగాణలో ఏర్పాటైన తొలి గ్రంథాలయం. మునగాల రాజా ఎన్.వెంకటరావు, హైదరాబాద్ మునసబ్‌దార్ రావిచెట్టు రంగారావు ఆర్థిక ప్రోత్సాహంతో లక్ష్మణరావు ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. 1904లో హన్మకొండలో శ్రీ రాజరాజ ఆంధ్ర భాషా నిలయం, 1905లో సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్థిని లాంటి తెలుగు గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. 1906లో లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రభుత్వ వ్యతిరేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వానికి సందేహం వచ్చింది. దీంతో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి ప్రధాన కేంద్రాన్ని మద్రాసుకు తరలించారు. ఈ విధంగా తెలంగాణలో సాంస్కృతిక పునర్జీవనానికి పునాదులు వేయడంలో కొమర్రాజు లక్ష్మణరావు సఫలీకృతుడయ్యాడు .

ఆంధ్ర జనసంఘం ఏర్పాటు


1921 నవంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాద్ సంస్థాన సాంఘిక సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి సంఘ సంస్కర్త, ఎస్.ఎన్.డి.టి. మహిళా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడైన మహర్షి కార్వే అధ్యక్షత వహించారు. ఈ సమావేశ కార్యక్రమాలను ఆంగ్ల, ఉర్దూ భాషల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలంపల్లి వెంకట రామారావు ఒక తీర్మానంపై తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న ఒక వర్గం ఆయన ప్రసంగాన్ని అడ్డుకొంది. ఈ సమావేశంలో తెలుగు భాషకు అవమానం జరిగిందని భావించి, తెలుగువారి కోసం ఓ సంస్థను ప్రారంభించాలని తీర్మానించారు. మాడపాటి హనుమంతరావు, బి.రామకృష్ణారావు, ఎం.నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు సహా 11 మంది సభ్యులతో ఆంధ్ర జనసంఘం పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర జనసంఘం మొదటి సమావేశం 1922 ఫిబ్రవరి 14న కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలోనే ఆంధ్ర జనసంఘం పేరును నైజాం ఆంధ్ర రాష్ర్ట జనసంఘంగా మార్చారు. తెలంగాణ ప్రజల్ని సాంఘిక, ఆర్థిక, సాంస్కృతికాభివృద్ధి దిశగా నడపడమే ఈ సంఘం ముఖ్యోద్దేశం.

 తెలంగాణలోని వివిధ ఆంధ్ర సంఘాల కార్యకలాపాలను సమన్వయపరిచేందుకు ఆంధ్ర జన కేంద్ర సంఘం అనే కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా పనిచేశారు. వెట్టిచాకిరి, వర్తక సంఘం అనే కరపత్రాలను ఈ సంస్థ విడుదల చేసింది. ఆంధ్ర జన సంఘం నిర్వహించిన తొలి నాలుగు సమావేశాలు హైదరాబాద్(1923), నల్గొండ(1924),మధిర(1925), సూర్యాపేట(1928)లో జరిగాయి. నిజాం ఆంధ్ర రాష్ర్ట ప్రశంస, నిజాం ఆంధ్ర రాష్ర్ట ఆంధ్రులు అనే పుస్తకాలను ప్రచురించారు. కొమర్రాజు లక్ష్మణరావు జ్ఞాపకార్థం లక్ష్మణరాయ పరిశోధక మండలి పేరుతో ఒక చారిత్రక పరిశోధన సంఘాన్ని జన సంఘం ఏర్పాటు చేసింది. 1930లో ఈ సంస్థ కాకతీయ సంచిక అనే పేరుతో ఒక సంపుటిని విడుదల చేసింది.